విడాకులపై స్పందించిన రజనీ కుమార్తె

17 Sep, 2016 08:29 IST|Sakshi
విడాకులపై స్పందించిన రజనీ కుమార్తె

చిత్ర పరిశ్రమలో మరో జంట విడాకులు తీసుకోబోతుంది. అయితే విడాకులు తీసుకోబోతున్నది సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె కావటంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.  రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ తన భర్త అశ్విన్ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. ఈ జంట మధ్య మనస్పర్ధలే ఇందుకు కారణం అని ప్రచారం జరుగుతోంది.

కాగా  విడాకుల వ్యవహారంపై  రజనీ కుమార్తె సౌందర్య స్పందించారు. తన వివాహానికి సంబంధించిన వస్తున్న వార్తలు వాస్తవమే అన్నారు.  ఏడాది కాలంగా తాను, అశ్విన్ విడివిడిగా ఉంటున్నామని, తమ విడాకుల విషయంలో చర్చలు నడుస్తున్నాయన్నారు. అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమని, దీనిపై ఊహాగానాలు అనవసరమన్నారు. తమ ప్రైవసీని గౌరవించి, ఈ విషయాన్ని పెద్దదిగా చేయొద్దని ఆమె సూచించారు. ఈ మేరకు సౌందర్య ట్విట్ చేశారు. అలాగే తమ కుటుంబానికి అన్నివిధాల మద్దతుగా నిలిచినందుకు సోదరి భర్త ధనుష్కు ఆమె థ్యాంక్స్ చెప్పారు.

కాగా సౌందర్యరజనీకాంత్‌కు 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వారికి ఇటీవలే ఇక బిడ్డ కూడా కలిగాడు. ఇక గ్రాఫిక్స్ టెక్నాలజిలో నిపుణురాలైన సౌందర్య గోవా చిత్రం ద్వారా నిర్మాతగానూ, తన తండ్రి హీరోగా నటించిన యానిమేషన్ చిత్రం కోచ్చడైయాన్ చిత్రంతో దర్శకురాలుగా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. తాజాగా ధనుష్ హీరోగా సౌందర్య ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.