‘నా కల నిజమైంది.. ప్రపంచానికి నేనే హీరోయిన్‌’

18 Apr, 2019 09:22 IST|Sakshi
శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసిన కేసీఆర్‌ ఫొటో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ ​కౌచ్‌ బాధితుల పోరాటానికి తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కల సాకారమైందనీ, ఇందుకు ఒక హైదరాబాదీగా తనకు చాలా గర్వంగా ఉందంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రపంచానికి తనను హీరోయిన్‌ చేశారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పోటారానికి అద్భుతమైన ఫలితాలొచ్చాయంటూ ఉద్యమానికి గుండె లాంటి అపూర్వ(నటి)కు, ఇంకా ఈ ఉద్యమంలో సాయపడిన ప్రతీ ఒక్కరికీ  పేరుపేరున శ్రీరెడ్డి కృతజ్ఞతలు  చెప్పారు.

తెలుగు సినిమా రంగంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై తొలిసారిగా గొంతెత్తిన నటి శ్రీరెడ్డి. అనంతరం మీటూ అంటూ చాలామంది బాధితులు బహిరంగంగా తన బాధల గాథలను ప్రపంచానికి చెబుతూ ఈ ఉద్యమంలో జత కలవడంతో ఇది దావానలంలా రాజుకుంది. అటు వివిధ ప్రజా, మహిళా సంఘాలు ఈ ఉద్యమానికి బాసటగా నిలిచాయి. ప్రతిఫలంగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.  ఈ మేరకు బుధవారం జీవో నంబర్‌ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్‌ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి సభ్యులుగా ఉంటారు.

ఇంకా సినిమా ప్రముఖులు రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత కె.ఎల్ నారాయణ, నటి ప్రీతి నిగమ్, నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, దర్శకులు శంకర్, తమ్మారెడ్డి భరద్వాజతోపాటు,  మహిళా సంక్షేమ, తెలంగాణా అభివృద్ధి సంస్థ లాంటి  వివిధ ప్రభుత్వ శాఖల అధ్యక్షులు, కమిషనర్లు, డైరెక్టర్లు కూడా  ఈ కమిటీలో  సభ్యులుగా ఉంటారు.

 చదవండి : లైంగిక వేధింపులు; ప్యానెల్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

మరిన్ని వార్తలు