ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది

20 Nov, 2019 00:16 IST|Sakshi

ఈ ఏడాది చివర్లో ఉత్తరం వైపునకు పయనం కానుంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. డిసెంబరు రెండో వారంలో ఈ చిత్రబృందం నార్త్‌ ఇండియాకు పయనం కానుందని తెలిసింది. అక్కడ దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది.

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు అజయ్‌ దేవగన్‌ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం. కీలక సన్నివేశాలను హర్యానాలో జరపడానికి ప్లాన్‌ చేశారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ మొదలై ఏడాది అవుతోంది. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని బుధవారం ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు