పెళ్లి కథనాలపై శ్వేతా బసు క్లారిటీ

3 Jun, 2018 13:55 IST|Sakshi
గ్యాంగ్‌ స్టార్స్‌ ప్రమోషన్‌లో నటి శ్వేతా బసు ప్రసాద్‌

సాక్షి, ముంబై: పెళ్లి కథనాలపై నటి శ్వేతాబసు ప్రసాద్‌ ఎట్టకేలకు స్పందించారు. కొత్తబంగారు లోకం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఈ మధ్య గ్యాంగ్‌ స్టార్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వివాహంపై వస్తున్న పుకార్లపై పెదవి విప్పారు. బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌తో గత నాలుగేళ్లుగా స్నేహంగా ఉంటున్న ఆమె.. అతన్నే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. 

‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలతో ప్రేమను వ్యక్తం పరుస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో ప్రపోజ్‌ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి ఇంట్లో ఒప్పుకొన్నారు. అయితే పెళ్లికి ఇప్పుడే తొందరేం లేదు. మా ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న కథనాలు నిజమే. కానీ, మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదు’ అని శ్వేత తెలిపారు. 

బాలీవుడ్‌లో ఇక్బాల్‌ చిత్రంతో బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్వేత.. కొత్త బంగారు లోకంతో తెలుగువారికి చేరువయ్యారు. తర్వాత కళావర్‌ కింగ్, రైడ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కాబోయే భర్తతో రూపొందిస్తున్న కొన్ని షార్ట్‌ ఫిలింస్‌లో, మరికొన్ని వెబ్‌ సిరీస్‌లతోపాటు బాలీవుడ్‌లోనూ ఓ పొలిటికల్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు