తెలుగు దర్శకులపై గ్రంథం

10 Aug, 2015 23:50 IST|Sakshi

1932లో పురుడు పోసుకుంది తెలుగు సినిమా. మన తొలి చిత్రం ‘భక్తప్రహ్లాద’ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి మొదలుకుని ఇప్పటి వరకూ ఎంతో మంది దర్శకులు తమ సృజనతో తెలుగు సినిమాకు ఖ్యాతిని ఆర్జించిపెట్టారు. ఈ దర్శకుల ప్రస్థానాన్ని, సృజనాత్మకతను భావితరాలకు తెలియజెప్పే ఉద్దేశంతో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఓ ప్రయత్నం చేస్తోంది. దర్శకుల సమాచారాన్ని సేక రించి ‘తెలుగు దర్శకుల సంక్షిప్త చరిత్ర’ పేరుతో ఓ పుస్తకం తీసుకు రానుంది.
 
 ఈ విశేషాలను దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ తెలియజేస్తూ-‘‘1932 నుంచి 2007 వరకూ అందరి వివరాలూ సేకరించగలిగాం. కానీ, ఆ తర్వాత దర్శకులుగా పరిచయమైన వారి వివరాలు మాకు లభ్యం కావడం లేదు. అలాంటి దర్శకులు తమ వివరాలను tfda08@gmail.com కు మెయిల్ చేయాలి. త్వరలోనే ఈ గ్రంథాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.