సర్దుకు పోతున్నారు..!

17 Nov, 2015 09:49 IST|Sakshi
సర్దుకు పోతున్నారు..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా థియేటర్లో ఉండగా మరో సినిమాను రిలీజ్ చేసి కలెక్షన్లు సాధించటం కష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ చేసే పరిస్థితి అసలే కనిపించటం లేదు. చిన్న సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే చాలామంది నిర్మాతలు బరిలో దిగి తేల్చుకుందాం అనే కన్నా, సింపుల్గా సర్దుకుపోందాం అంటున్నారు.

ఈ డిసెంబర్లో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్లతో తెరకెక్కిన మూడు సినిమాలు, ఒకేసారి రిలీజ్కు రెడీ అయ్యాయి. మూడు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన నిర్మాతలు వారం, వారం గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా పివిపి సంస్థ నిర్మిస్తున్న సైజ్ జీరో సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు రిలీజ్కు రెడీ అయిన నిఖిల్, కోన వెంకట్ల 'శంకారాభరణం'ను ఒక వారం ఆలస్యంగా డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వస్తున్న 'బెంగాల్ టైగర్'  కూడా పోటీ పడటానికి సిద్ధంగా లేడు. అందుకే మరింత గ్యాప్ తీసుకుని, డిసెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్నంది దర్శకుడు. థియేటర్లలో క్లాష్ లేకుండా నిర్మాతలు అడ్జస్ట్ అయిపోవటం మంచి పరిణామమే అయినా, ఎంతమంది నిర్మాతలు ఈ ఫార్ములాను ఫాలో అవుతారో చూడాలి.