టాలీవుడ్‌ సెలబ్రిటీల భోగి సందడి..

14 Jan, 2020 15:31 IST|Sakshi

తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మూడు రోజుల పండుగలో తొలి రోజైనా భోగి నాడు.. భోగి మంటలు వేసి, వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అలకరించారు. పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా భోగిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, కల్యాణ్‌దేవ్‌, నిహారిక, సుష్మిత.. ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నిహారిక దోశ వేస్తున్న ఫొటోను సుష్మిత.. దోశ స్టెప్పు అని పేర్కొన్నారు. 

మరోవైపు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కుటుంబం శ్రీ విద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో భోగి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్‌లు పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ కొత్తగా ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు’ అని లక్ష్మి పేర్కొన్నారు. 

అలాగే విక్టరీ వెంకటేశ్‌ కూడా భోగి శుభాకాంక్షలు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్‌ ఈషా రెబ్బా.. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు