మాటల మాంత్రికుడి మరో అవతారం

8 Oct, 2016 12:07 IST|Sakshi
మాటల మాంత్రికుడి మరో అవతారం

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు గా ఉన్నవారందరూ నిర్మాణ రంగంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూరి జగన్నాథ్, సుకుమార్ లాంటి దర్శకులు నిర్మాతలుగా మారి వరుస సినిమాలు ప్లాన్ చేస్తుండటంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల 'అ..ఆ..' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించబోయే సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అదే సమయంలో నిర్మాతగా మారీ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా కథను ముందుగా నిర్మాత రాధాకృష్ణకు వినిపించారు.

అదే సమయంలో అక్కడ ఉన్న త్రివిక్రమ్కు కథ బాగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మించేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం ద్వారకా, అర్జున్ రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, ఆ రెండు సినిమాలు పూర్తవ్వగానే నందినీ రెడ్డి దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మించబోయే సినిమా షూటింగ్లో పాల్గొంటాడు.