ఉదయ్‌కిరణ్ ఆఖరి చిత్రం ఇదే అంటే బాధగా ఉంది : విషిత

17 Jun, 2014 01:28 IST|Sakshi
ఉదయ్‌కిరణ్ ఆఖరి చిత్రం ఇదే అంటే బాధగా ఉంది : విషిత

‘‘ఉదయ్‌కిరణ్ హీరోగా 14 చిత్రాల్లో నటిస్తే, నేను 9 సినిమాలకు పాటలు స్వరపరిచాను. ‘చిత్రం’ సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’తో ముగియడం బాధాకరం. ఈ చిత్రానికి మున్నా కాశీ మంచి పాటలు ఇచ్చి ఉంటారని ఊహిస్తున్నా’’ అని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. ఉదయ్‌కిరణ్ హీరోగా ఆయన మేనేజర్ మున్నా నిర్మించిన సినిమా ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’. డింపుల్, మదాలసా శర్మ, గరిమ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మోహన్ ఎ.యల్.ఆర్.కె. దర్శకుడు.
 
 హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మల్టీ డైమన్షన్ వాసు సీడీని ఆవిష్కరించి ఉదయ్‌కిరణ్ భార్య విషితకు అందజేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయం చేకూర్చి, ఉదయ్‌కి ఘన నివాళి ఇవ్వాలని కోరుకుంటున్నానని వాసు అన్నారు. ఉదయ్ ఆఖరి చిత్రం ఇదేనంటే చాలా బాధగా ఉందని, నిజజీవితంలోనూ తను హీరో అని విషిత చెప్పారు. ఉదయ్ నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్‌గా నిలిచాయని,
 
 ఈ చిత్రం కూడా ఆ కోవలోకి చేరాలనే తపనతో మంచి పాటలు ఇవ్వడానికి ప్రయత్నం చేశానని మున్నా కాశీ అన్నారు. నిర్మాతగా తన మొదటి సినిమా ఉదయ్‌కి చివరి సినిమా అవుతుందనుకోలేదని మున్నా అన్నారు. ఉదయ్‌తో సినిమా చేసిన అనుభవాన్ని మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. ఈ ఆడియో వేడుకలో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి, బావ ప్రసన్న కుమార్, వారి కుమారుడు తేజ, కుమార్తె మంజు కూడా పాల్గొన్నారు.