గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్?

11 Feb, 2015 03:02 IST|Sakshi
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్?

నటుడు విక్రమ్, దర్శకుడు గౌతమ్ మీనన్ కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కనుందన్నది తాజా సమాచారం. విక్రమ్ ఐ చిత్రంతోను, గౌతమ్‌మీనన్ ఎన్నై అరిందాల్ చిత్రంతోను విజయాలను సాధించి మంచి జోష్‌లో ఉన్నారు. అలాంటివీరిద్దరి కలయికలో చిత్రం అంటే ఆ చిత్రం క్రేజ్ ఏ లెవల్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గౌతమ్‌మీనన్ ఇటీవల విక్రమ్‌ను కలిసి కథ చెప్పినట్లు ఆ కథ ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో వీరి కాంబినేషన్‌లో చిత్రం రావడం ఖాయం అనేది కోలీవుడ్ టాక్. ప్రస్తుతం విక్రమ్, విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎండ్రదుక్కుళ్ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సమంత నాయకిగా నటించిన ఈ చిత్రం మార్చిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఎన్నై అరిందాల్ తరువాత గౌతమ్ మీనన్, ఆగిన శింబు చిత్రం బూజు దులపడానికి సిద్ధం అయ్యారని సమాచారం. ఎన్నై అరిందాల్ చిత్రానికి ముందు శింబు హీరోగా సట్టైండ్రు మరుదు వానిలై అనే చిత్రాన్ని ప్రారంభించారు. సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నిలిపేసి అజిత్ హీరోగా ఎన్నై అరిందాల్ చిత్రం చేశారు. ఇప్పుడు శింబు చిత్రానికి అచ్చం ఎన్భదు ముడయమరాగా పేరు మార్చి పూర్తి చే యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో పల్లవిసుభాష్ కథా నాయకిగా నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి విక్రమ్ చిత్రాన్ని హ్యాండిల్ చేయాలని గౌతమ్ మీనన్ భావిస్తున్నట్లు సమాచారం.