ధనుష్‌ అబద్దం చెప్పారు: సీనియర్‌ నటి

26 Jun, 2017 18:32 IST|Sakshi
ధనుష్‌ అబద్దం చెప్పారు: సీనియర్‌ నటి

తమిళసినిమా: నటుడు ధనుష్‌ అబద్దం చెప్పారని  బాలీవుడ్‌ భామ కాజోల్ అన్నారు‌. హిందీలో క్రేజీ కథానాయికిగా వెలుగొందుతున్న సమయంలోనే ఈ బ్యూటీ మిన్సార కణవు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం విజయాన్ని సాధించినా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించలేదు. కాగా చాలా కాలం తరువాత నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న వీఐపీ 2 చిత్రంతో మరో సారి కోలీవుడ్‌లో మెరవడానికి రెడీ అవుతున్నారు. ఇందులో కాజోల్‌ ప్రతినాయకిగా నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే అది నిజం కాదని ఆదివారం జరిగిన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ధనుష్‌ స్పష్టం చేశారు. ఇందులో కాజోల్‌ది తన పాత్రతో సమాంతరంగా సాగే ప్రధాన పాత్ర అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాజోల్‌ మాట్లాడుతూ తాను ఇతర భాషా చిత్రాల్లో నటించడానికి సాహసించడం లేదన్నారు. అప్పుడేప్పుడో మిన్సార కణవు చిత్రంలో నటించాననీ, దీంతో వీఐపీ 2 చిత్రంలో నటించడానికి తాను చాలా నెర్వెస్‌గా ఫీలయ్యానన్నారు. భాష తెలియకపోవడమే అందుకు కారణం అని అన్నారు.

ఈ చిత్రం కోసం ధనుష్, సౌందర్యరజనీకాంత్‌లు తన ఇంటికి వచ్చి తమిళంలో మాట్లాడటం గురించి చాలా నేర్పించారన్నారు. తమిళ భాష ఫోభియో నుంచి వారే తనను తప్పించారని చెప్పారు. అయినా తమిళంలో సంభాషణలు చెప్పడానికి బుర్ర బద్దలు కొట్టుకున్నానన్నారు. కొంచెం తమిళం, ఎక్కువ ఆంగ్లం భాషల్లో డైలాగులు చెప్పెశాననీ అన్నారు. అయితే తాను తమిళంలో డైలాగులు బాగా చెప్పానని నటుడు ధనుష్, సౌందర్యరజనీకాంత్‌లు అబద్ధం చెప్పారనీ వ్యాఖ్యానించారు. ఏదేమైనా వీఐపీ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని, ధనుష్‌ చాలా మంచి యాక్టర్‌ అని ప్రశంసించారు. సౌందర్యరజనీకాంత్‌ స్క్రిప్ట్‌ విషయంలో చాలా క్లియర్‌గా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. ఇందులో ఈమె కార్పోరేట్‌ సంస్థ అధికారిణి వసుంధర పాత్రలో నటించారు. కాగా ఈ చిత్ర హిందీ వెర్షన్‌ కోసం ధనుష్, కాజోల్‌పై ప్రమోషన్‌ గీతాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించడం విశేషం.