మూడు ముక్కల్లో ఏం చెబుతారు?

30 Dec, 2014 23:03 IST|Sakshi
మూడు ముక్కల్లో ఏం చెబుతారు?

ఆ ఇద్దరూ నిక్షేపంగా ఉద్యోగం చేసుకుంటుంటారు. కానీ, కొన్ని కారణాల రీత్యా ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకుంటారు. ఆ వ్యాపారంతో వారి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే...’. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్.పి. చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి మధుమిత దర్శకురాలు. రచయిత వెన్నెలకంటి రెండో కుమారుడు రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి కీలక పాత్రలు చేశారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది.
 
  ఈ సందర్భంగా ఎస్.పి. చరణ్ మాట్లాడుతూ -‘‘తమిళంలో పలు చిత్రాలు నిర్మించాను. తెలుగులో నిర్మాతగా ఇది మొదటి సినిమా. ఈ చిత్రదర్శకురాలు తమిళంలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘వల్లమై తారాయో’కి పలు అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ఆమె చేసిన ‘కొలకొలయా ముందురికా..’ కూడా మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని ఆమె అద్భుతంగా తెరకెక్కించారు. వచ్చే నెల 23న పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రానికి సంభాషణలు రాయించడానికి రాకేందు మౌళీని పిలిపించాం. కానీ, హీరోగా తనే కరెక్ట్ అని తీసుకున్నాం’’ అని మధుమిత అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి.
 

>