హీరోయిన్‌ను ఏడిపించిన దర్శకుడు!

21 Nov, 2015 20:42 IST|Sakshi
హీరోయిన్‌ను ఏడిపించిన దర్శకుడు!

దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ సినిమాల్లో పనిచేయడమంటే మాటలు కాదు. ఆయన సినిమాల్లో పనిచేసే నటులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఆయన తాజా చిత్రం 'బాజీరావు మస్తానీ'లో షూటింగ్‌లో ప్రియాంక చోప్రా ఏడ్చేసిందట. ఈ విషయాన్ని హీరో రణ్‌వీర్‌ సింగ్ వెల్లడించాడు. భన్సాలీ కారణంగానే ఆమె కంటతడి పెట్టిందని తెలిపాడు. 'బాజీరావు మస్తానీ' చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా విలేకరుల సమావేశంలో రణ్‌వీర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

మొదట ప్రియాంక మాట్లాడుతూ ' చిత్రం కోసం నేనేమీ కష్టపడలేదు. చాలా కష్టపడింది దీపిక, రణ్‌వీర్‌లే. నేను సెట్స్‌కు వచ్చి తొమ్మిది అడుగుల చీరను కట్టుకోవడం, సంప్రదాయ నగలు ధరించడం చేసే దాన్ని. అది కొంచెం కష్టమే అనిపించేది' అని పేర్కొంది. ఈ సమయంలో రణ్‌వీర్ మైక్ అందుకొని 'నన్ను చెప్పనివ్వండి. మూడో రోజు షూటింగ్ సందర్భంగా ప్రియాంక బోరున ఏడ్చేసింది. సంజయ్‌లీలా భన్సాలీతో రెండోసారి సినిమా చేస్తున్నారు మీకేమైనా 'పిచ్చా' అని మమ్మల్ని తిట్టింది. కానీ త్వరగానే ఆమె పనితీరును ఆకళింపు చేసుకొని అత్యద్భుతంగా నటించింది' అని చెప్పాడు. 'బాజీరావ్‌ మస్తానీ'లో టైటిల్‌ రోల్స్ పోషిస్తున్న రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే గతంలో భన్సాలీతో 'రామ్‌లీలా' సినిమా చేసిన సంగతి తెలిసిందే.