కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారు

27 May, 2018 07:23 IST|Sakshi

అభివృద్ధి చేయకుండా ఫ్లోరైడ్‌ జిల్లాగా మార్చారు

నల్లగొండ నియోజకవర్గ నాయకులతో సమావేశంలో మంత్రి కేటీఆర్‌

నల్లగొండ : యాబై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండను అభివృద్ధి చేయకుండా వారి స్వార్థం కోసం ఫ్లోరైడ్‌ పీడిత జిల్లాగా మార్చారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నల్లగొండ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా నల్లగొండ మండలంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులను మంత్రి కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. 

మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి హాజరైన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను మోసం చేయడానికి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీపై విశ్వాసం ఉంచారని, కేసీఆర్‌ను నమ్ముతున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పే కపట మాటలు ఇక్కడ చెల్లవని అన్నారు.  

మరిన్ని వార్తలు