హోంగార్డుల సంక్షేమానికి కృషి 

27 May, 2018 07:27 IST|Sakshi
హోంగార్డుల సంక్షేమ పథకాల పత్రాలను విడుదల చేస్తున్న ఎస్పీ గోపీనాథ్‌ జట్టి

కర్నూలు : హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ గోపీనాథ్‌ జట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల సంక్షేమానికి చేపట్టిన సంక్షేమ పథకాల పత్రాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డుల సంక్షేమ పథకాల పత్రాన్ని ప్యాకెట్‌ డైరీగా ఉంచుకోవాలని, ప్రభుత్వ పథకాల గురించి తమ కుటుంబాలకు కూడా తెలియజేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, చంద్రన్న బీమా పథకం, వ్యక్తిగత ప్రమాద బీమా, మెడి క్లెయిమ్‌ పాలసీ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన తదితర పథకాల గురించి వివరించారు. హోంగార్డులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. కార్యక్రమంలో సదరన్‌ రీజియన్‌ హోంగార్డ్స్‌ కమాండెంట్‌ ఎన్‌.చంద్రమౌళి, డీఎస్పీలు బాబుప్రసాద్, సి.ఎం.గంగయ్య, లక్ష్మినారాయణరెడ్డి, సీఐ పవన్‌కిషోర్, ఈ–కాప్స్‌ ఇన్‌చార్జ్‌ రాఘవరెడ్డి పాల్గొన్నారు.  

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..  
కర్నూలు హోంగార్డు యూనిట్‌లో పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు యల్లప్ప కుటుంబానికి వెల్ఫేర్‌ ఫండ్‌ చెక్కును ఎస్పీ అందజేశారు. యల్లప్ప భార్య శకుంతలను శనివారం  ఎస్పీ తన కార్యాలయానికి పిలిపించి రూ.10 వేల చెక్కు ఇచ్చారు. వారి కుటుంబంలో ఒకరికి త్వరలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హోంగార్డ్స్‌ కమాండెంట్‌ చంద్రమౌళి, హోంగార్డు డీఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు