ఎన్పీఆర్ రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధం
న్యూఢిల్లీ: 2020 కల్లా జాతీయ ప్రజా రిజిస్టర్(ఎన్పీఆర్)ను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని ఆధారంగానే దేశవ్యాప్త పౌరసత్వ రిజిస్టర్ను తయారు చేయనుంది. ఎన్పీఆర్ పూర్తయి, అధికారికంగా ముద్రించాక ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్ఐసీ) రిజిస్టర్కు ఆధారంగా చేసుకుంటుంది. అంటే, ఇది అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్నార్సీ)కి అఖిల భారత రూపమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ఈ కార్యక్రమం అస్సాం మినహా దేశవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆ ప్రాంతంలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్న లేదా మరో ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకున్న వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి.