ఏడేళ్లలో 48కోట్ల మంది చనిపోతారా?

1 Nov, 2019 13:09 IST|Sakshi

ఢిల్లీ : ప్రసుత్తం మనం జీవిస్తున్న ఆధునిక జీవనంలో కాలుష్యం అనేది ఈ భూమండలం మీద ఎంత ప్రభావం చూసిస్తుందో మనందరికి తెలిసిందే. కాలుష్యం అనేది రకరకాలుగా ఉన్నా ప్రభావం చూసిస్తున్నది మాత్రం సగటు జీవరాశి మీదే అన్న సంగతి చెప్పనవసనం లేదు. ఈ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఏకంగా ప్రపంచదేశాలన్ని ఒక్క తాటి మీదకు వచ్చి వేడెక్కిన భూగోళాన్ని 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గించాలని ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.


కాలుష్యానికి మచ్చుతునక.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌ ప్రాంతం

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా యునివర్సిటీ ఆఫ్‌ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఎపిక్‌) చేపట్టిన కాలుష్యం ప్రభావం సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 225 దేశాలలో కాలుష్య ప్రమాణాలను 2.5 పర్టికులేట్‌ మాటర్‌లో పరిగణలోకి తీసుకొని సర్వే చేపట్టారు. ఈ జాబితాలో అత్యంత కాలుష్య ప్రభావ దేశంగా భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో నేపాల్‌ దేశం ఉన్నట్లు సర్వే పేర్కొంది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సూచించిన పరిధి మేరకు కాలుష్యాన్ని నియంత్రించడంలో భారతదేశం విఫలమైందని సర్వేలో బహిర్గతమైంది.

తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 48 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 40శాతం మంది ప్రజలకు వారి ఆయుష్‌లో ఏడేళ్లు తగ్గిందని పేర్కొంది. 2013-17 శాంపిల్‌ సర్వే ప్రకారం భారతదేశం ఆయుర్దాయం  67 ఏళ్ల నుంచి 69 ఏళ్లకు పెరిగినా కాలుష్య ప్రభావంతో అది ఏడేళ్లకు తగ్గి 60 నుంచి 62 ఏళ్ల దగ్గర ఆగిపోయింది. ముఖ్యంగా ఇండో- గాంగటిక్‌ ప్రాంతంలో ఉన్న పంజాబ్‌, చంఢీఘర్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఈ రాష్ట్రాల్లో విపరీత కాలుష్య ప్రభావం వల్ల అక్కడి ప్రజల ఆయుర్దాయం 62 ఏళ్లుగా ఉందని పేర్కొంది. 

అయితే ఇదంతా కేవలం 18 ఏళ్లలోనే జరిగినట్లు ఎపిక్‌ తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. 1998కి ముందు ఇంత కాలుష్యం లేదని, 1998-2016 వరకు 72 శాతం మేర కాలుష్యం పెరిగిందని తమ అధ్యయనంలో నివేదించింది. తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం పైన పేర్కొన్న ఏడు రాష్ట్రాల్లోని కాలుష్య ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే 1998-2016 మధ్య కాలంలో మిగతా అన్నిదేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ ఉండడం గమనార్హం.

అయితే ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన (10మైగ్రా.మీటర్‌ క్యూబ్‌)  ప్రమాణాలు పాటిస్తే కొంతమేర ప్రభావం తగ్గి భారతదేశంలో 4.3 సంవత్సరాల ఆయుశ్శు పెరిగే అవకాశం ఉందని  తన రిపోర్ట్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కాలుష్యాన్ని అరికట్టేందుకు నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ఇండియా ప్రోగ్రామ్‌(ఎన్‌క్యాప్‌) పేరుతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల వచ్చే ఐదేళ్లలో 20-30 శాతం మేర కాలుష్యాన్ని తగ్గించే పనిగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్‌ను కచ్చితంగా అమలు చేస్తే సగటు భారతీయుడు ఆయురార్ధం 1.3, ప్రభావితమైన ఏడు రాష్ట్రాల్లో 2ఏళ్లకు పెరుగుతుందని నివేదికలో వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు