ఈ అమ్మకు సోషల్‌ మీడియా సలాం!

24 Nov, 2017 15:10 IST|Sakshi

న్యూఢిల్లీ: అమ్మ ఎవరికైనా అమ్మే అంటారు. ఈ ఫొటో వెనుకున్న స్టోరీ గురించి తెలుసుకుంటే మీరు అదే అంటారు. ఈ చిత్రంలో జింకపిల్లకు పాలిస్తున్న అమ్మ రాజస్థాన్‌లోని బిష్ణోయ్‌ సామాజిక వర్గానికి మహిళ. ప్రముఖ షెఫ్ వికాస్‌ ఖన్నా ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మానవత్వానికి చిరునామాగా నిలిచిన ఈ మహిళ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ‘ఈ ఒక్క జింకపిల్లకే కాదు. తన జీవిత కాలంలో చాలా జింకపిల్లలకు చనుబాలిచ్చినట్టు ఆమె నాతో చెప్పారు. రాజస్థాన్ ఎడారుల్లో అనాథలుగా మిగిలిన, గాయపడిన ఎన్నో జింక పిల్లల ప్రాణాలు ఈవిధంగా కాపాడినట్టు వెల్లడించార’ని వికాస్‌ ఖన్నా వివరించారు. ప్రకృతిలోని చెట్లు, జంతువుల పట్ల బిష్ణోయ్‌ మహిళలు ఎంతో అనురక్తి కలిగివుంటారని వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోను షేర్‌ చేసిన కొద్ది గంట్లోనే వేలాది లైకులు వచ్చాయి. బిష్ణోయ్‌ మహిళల పర్యావరణ ప్రియత్వాన్ని, సహృదయతను మెచ్చుకుంటూ కామెంట్లు వచ్చాయి. చిప్కో ఉద్యమంలో బిష్ణోయ్‌ మహిళలు ముందుండి పోరాడారని, కృష్ణ జింకలను తమ సొంత పిల్లల్లా సాకుతారని పలువురు ట్వీట్‌ చేశారు. మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఫొటోలోని మహిళకు సలాం చెబుతూ చాలా మంది పోస్టులు పెట్టారు.

మరిన్ని వార్తలు