వైరల్‌.. ఈవీఎం మిషన్‌కి పూజలు చేసిన ఎమ్మెల్యే

22 Nov, 2018 11:27 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ఎమ్మెల్యే ఒకరికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పోలింగ్‌ కేంద్రంలో పూజలు నిర్వహించడంమే ఇందుకు కారణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నవగఢ్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 20న ఛత్తీస్‌గఢ్‌లో చివరి దశ పోలీంగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే.  పోలింగ్‌ రోజున నవగఢ్ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక మంత్రి దయాల్‌దాస్‌ బాఘెల్‌ ఓ పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంకి పూజలు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. బేమెతర జిల్లాలోని నవగఢ్ నియోజకవర్గంలో గత మంగళవారం పోలింగ్‌ ప్రారంభమవడానికి ముందు దయాల్‌దాస్‌ స్థానిక పోలింగ్‌ కేంద్రంలో పూజలు చేశారు.

ఈవీఎం మిషన్‌కు దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తీలు కూడా ముట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల​ కావడంతో స్పందించిన రిటర్నింగ్‌ అధికారి దయాల్‌దాస్‌కు నోటీసులు జారీ చేశారు. 24గంటల్లోగా వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ సంఘటనపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో నేతలు సామాన్యులను పూజించాలి గానీ ఈవీఎంలను కాదని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. గత 15ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ప్రజల కోసం పనిచేయకుండా ఇప్పుడు ఈవీఎంలకు పూజలు చేస్తే ఏం లాభమని ఎద్దేవా చేసింది. కాగా ఈ వార్తలపై దయాల్‌దాస్‌ ఇంతవరకూ స్పందించలేదు.

మరిన్ని వార్తలు