‘సట్టా’ చాటేదెవరు.. బీజేపీకి బుకీల జై!

4 Dec, 2018 08:46 IST|Sakshi

రాజస్తాన్‌లో కాంగ్రెస్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి బుకీల జై 

మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ తప్పదని అంచనాలు 

హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్‌లు భారీగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ సట్టా (బెట్టింగ్‌)పై రోజురోజుకూ అంచనాలు మారుతున్నాయి. 

 రాజస్తాన్‌.. కాంగ్రెస్‌కే చాన్స్‌! 
‘రాజస్తాన్‌లో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ వెంటనే మళ్లీ అధికారంలోకి రావడం గత 25 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జరగలేదు. ఈ సారి కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వసుంధర రాజే కరిజ్మా తగ్గినట్లు కనిపిస్తోంది’ అని ఢిల్లీలో పేరుగాంచిన బుకీ ఒకరు చెప్పారు. రాజస్తాన్‌ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకే పరిమితం కావచ్చని సట్టా మార్కెట్‌ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 105 స్థానాలు వస్తాయని, మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుస్తారని చెబుతోంది. ఇందుకు తగ్గట్లే బెట్స్‌ జరుగుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా? 
ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మధ్యప్రదేశ్‌పై బెట్టింగ్‌ చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. ఇరు పక్షాల మధ్య చాలా స్వల్ప వ్యత్యాసంతో పందేలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇరు పార్టీల సీట్ల విషయంలో తేడా స్వల్పంగా ఉంటుందని బుకీలు అంచనా వేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో బీజేపీదే హవా! 

ఎన్నికలు పూర్తయిన చత్తీస్‌గఢ్‌లో బీజేపీకి మెజార్టీ వస్తుందని బుకీ ట్రెండ్‌ చెబుతోంది. బుకీల అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో వచ్చేనెల 11న తెలిసిపోతుంది. 
 

మరిన్ని వార్తలు