‘పులిని తిరిగి అడవికి పంపే సమయం వచ్చేసింది’

29 Jun, 2018 16:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలను కోతులు, నక్కలతో మోదీని పులితో పోల్చిన కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డేకు కాంగ్రెస్‌ దీటుగా బదులిచ్చింది. హెగ్డే వ్యాఖ్యలపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ స్పందిస్తూ క్రూర మృగంగా మారిన పులిని తిరిగి అడవికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.కర్ణాటకలోని కర్వార్‌లో శుక్రవారం ఓ సభలో పాల్గొన్న హెగ్డే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పులి లాంటి మోదీనే ఎంపిక చేసుకుంటారని కోతులు, నక్కలతో కూడిన విపక్షాలను కాదని వ్యాఖ్యానించారు.

గతంలోనూ పలు సందర్భాల్లో అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఏడాది జనవరిలో దళితులను కుక్కలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించగా తాను వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తనను టార్గెట్‌ చేసిన కుహనా మేథావులను ఉద్దేశించి అలా అన్నానని వివరణ ఇచ్చారు. అంతకుముందు బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు