జేఎన్‌యూ దాడి; ‘గుర్తు తెలియని వ్యక్తులపై’ కేసు!

7 Jan, 2020 13:58 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి ఆదివారం రాత్రి ఇనుప రాడ్లు, కర్రలతో జొరబడి హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లను చితక బాదడానికి కుట్ర పన్నింది, పిలుపునిచ్చిందీ ఏబీవీపీ నాయకులని ‘వాట్సాప్‌ గ్రూపు’ల్లో వచ్చిన సందేశాల ద్వారా గుర్తించినప్పటికీ, వారి మెసేజ్‌ స్క్రీన్‌ షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు వారిపై ఎలాంటి చర్య తీసుకోకుండా సోమవారం సాయంత్రం ‘గుర్తు తెలియని వ్యక్తుల’ పేరిట ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారని జేఎన్‌యూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

‘కర్రలు, రాళ్లు, చేతికి ఏవి దొరికితే వాటిని తీసుకెళ్లి కొట్టండంటూ వామపక్ష విద్యార్థులపై దాడికి పిలుపునిచ్చిందీ ఏబీవీపీయే’ అంటూ ఏబీవీపీ ఢిల్లీ జాయింట్‌ సెక్రటరీ అనిమా సోంకర్‌ ‘టైమ్స్‌ నౌ’ సాక్షిగా అంగీకరించినా, ‘అవును దాడికి మేమే బాధ్యులం, నోరు మూసుకొని ఉండకపోతే భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని జరుపుతాం’ అని హిందూ రక్షా దళ్‌ నాయకుడు భూపేంద్ర తోమర్‌ కూడా టీవీ సాక్షిగా హెచ్చరించినా వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఏమిటని అతివాద, మితవాద విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

గాయపడిన విద్యార్థినిపైనే కేసా?
ఏబీవీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐశే ఘోష్, మరో 19 మంది విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జనవరి నాలుగవ తేదీన ఐశే ఘోష్‌ నాయకత్వాన క్యాంపస్‌లోని సర్వర్‌ రూమ్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రే ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతవరకు ఈ రెండు కేసుల్లోనూ ఎవరిని పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పరిధిలో పనిచేస్తారు కనుక వారు ఏబీవీపీ నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేక పోతున్నారని ఐశే ఘోష్‌ ఆరోపించారు.

సంబంధిత వార్తలు..

జేఎన్‌యూ దాడి మా పనే

భయంతో ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి దూకేశారు..

జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా!

జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..!

‘ముసుగు దుండగులను గుర్తిస్తా’

మరిన్ని వార్తలు