చట్టాల సడలింపుతో సత్ఫలితాలు రావు!

21 May, 2020 18:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని గుజరాత్‌ సహా దాదాపు పది పారిశ్రామిక రాష్ట్రాలు ఇటీవల పలు కార్మిక చట్టాలను సడలించాయి. దీనిపట్ల ‘సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్లు సహా పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం? యజమానులకా, కార్మికులకా? ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా అధిక పెట్టుబడులు వచ్చి పడతాయా? (లాక్‌డౌన్‌: ఆగని విషాదాలు)

ఈ విషయంలో జంషెడ్‌పూర్‌ బిజినెస్‌ స్కూల్‌లో మానవ వనరుల విభాగంలో పని చేస్తోన్న ప్రొఫెసర్‌ కేఆర్‌ శ్యామ సుందర్, దేశంలోనే సిబ్బందిని సరఫరా చేసే అతిపెద్ద కంపెనీ ‘టీమ్‌ లీజ్‌’ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రితుపర్ణ చక్రవర్తి తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘కార్మిక చట్టాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. ఆ దిగ్భ్రాంతి నుంచి నేను ఇంకా కోరుకోలేదు. ఈ మార్పులను కంపెనీల యాజమానులు కూడా కలగనలేదు. ఆశించనూ లేదు. మూడు చట్టాలు మినహా మిగతా అన్ని చట్టాల్లో భారీ మార్పులను తీసుకరావడం ద్వారా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అందరికన్నా అన్ని రాష్ట్రాలకన్నా అత్యుత్సాహం చూపింది. యూపీతో పోలిస్తే మధ్యప్రదేశ్‌ రాష్ట్రం కొంచెం సంకుచితంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. అయితే ఈ మార్పులు కంపెనీ యజమానులకుగానీ, కార్మికులకుగానీ దోహదం చేసేవిలాగా లేవన్నది నా అభిప్రాయం’ అని శ్యామ్‌ సుందర్‌ తెలిపారు.

కార్మికులకు, యజమానులకు మధ్య తలెత్తే వివాదాలను చట్టపరమైన ప్రమాణాలు లేకుండా కేవలం ఇరువర్గాల కమిటీలతో ఎలా పరిష్కారం అవుతాయో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ సవరణలోతోని చైనా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఇక నుంచి భారత్‌ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అన్నారు. పైగా చైనా కార్మిక శక్తితో భారత కార్మిక శక్తిని పోల్చలేమని చెప్పారు.

రాష్ట్రాల స్థాయిలో చట్టాలను మార్చడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని, కేంద్ర చట్టాల పరిధి మార్పులు చేసి, వాటి పరిధిలోకి రాష్ట్రస్థాయి చట్టాలను తీసుకరావడం వల్ల ప్రయోజనం ఉంటుందని రితిపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడు కార్మిక చట్టాల ప్రయోజనాలను కార్మికులు పొందుతున్నారని, యాజమాన్యాలు కూడా కార్మిక చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ప్రయత్తిస్తున్నాయని, ఈ తరుణంలో చట్టాలను ఎత్తివేయడం మంచిది కాదని ఆయన సూచించారు. కార్మికుల్లో, తద్వారా ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతుందని, అది ఉత్పాదన శక్తిపై ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. (అదే వరస..ఆగని కరోనా కేసులు..)

మరిన్ని వార్తలు