ఫ్లెక్స్‌ ఇంజిన్‌ బైక్స్‌ వస్తున్నాయి

28 Jan, 2018 16:21 IST|Sakshi
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ

సాక్షి, న్యూఢిల్లీ : ఫ్లెక్స్‌ ఇంజిన్‌ బైక్స్‌ త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. రెండు బైక్స్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌, ఫ్లెక్స్‌ ఇంజిన్‌ బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. జనవరి నెలాఖరులోగా బైక్స్‌ను మార్కెట్లోకి తెస్తామని రెండు కంపెనీలు చెప్పాయని తెలిపారు.

ఏంటీ ఫ్లెక్స్‌ ఇంజిన్‌?
రెండు రకాల ఇంధనాలను ఫ్లెక్స్‌ ఇంజిన్‌లో వినియోగించొచ్చు. పెట్రోల్‌, ఇథనాల్‌లతో ఫ్లెక్స్‌ ఇంజిన్‌ బైక్స్‌ నడుస్తాయి. పెట్రోల్‌ వినియోగాన్ని క్రమంగా తగ్గించాలనే వ్యూహంలో భాగంగా ఇథనాల్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

క్రూడ్‌ ఆయిల్‌ కోసం ప్రతి ఏటా రూ. 7 లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నామని, ఇందులో కనీసం రూ. 2 లక్షల కోట్లను ఇథనాల్‌ వైపు మళ్లించినా వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఒక టన్ను వరి పొట్టు నుంచి 280 లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు.

ఇథనాల్‌ కేవలం దిగుమతుల ప్రత్యామ్నాయం కాదని చెప్పుకొచ్చిన గడ్కరీ.. ఇథనాల్‌ కాలుష్య రహితం అని చెప్పారు. గోధుమ పొట్టు, వెదురు చెట్ల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఇథనాల్‌ ఉత్పత్తి పెరిగేందుకు అందుకు అనుకూలమైన పంటలను వేయాలని చెప్పారు. అమెరికా, బ్రెజిల్‌, కెనడాల్లో మెర్సిడెజ్‌, బీఎండబ్ల్యూ, టయోటా కార్లు ఫ్లెక్స్‌ ఇంజిన్‌తో నడుస్తున్నాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు