ప్రేయసిని పెళ్లాడిన యువతి!

24 May, 2014 12:55 IST|Sakshi

యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించడం, అలా ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్నీ మామూలే. కానీ.. చాలాకాలంగా తనతో కలిసి ఉంటున్న ప్రేయసిని పెళ్లాడేసింది ఓ యువతి!! ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగింది. నికితా అసానీ (24) అనే యువతి సత్నా ప్రాంతంలో నివసిస్తుంది. ఆమె కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి కనపడకుండా పోయింది. దాంతో ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు జబల్పూర్ ప్రాంతంలో అచ్చం నికితలాగే ఉండే ఓ అమ్మాయి పోలీసులకు కనిపించింది.

దాంతో ఆమెను గుర్తించాలని తల్లిదండ్రులను పిలవగా, ఆమే అని తేలింది. కానీ వాళ్లతో ఇంటికి వెళ్లేందుకు నికిత నిరాకరించింది. తానెప్పటికీ తన ప్రేయసితోనే కలిసి ఉంటానని మొండికేసింది. అంతేకాదు, చాలాకాలంగా తాను సహజీవనం చేస్తున్న రజినీ రాజ్ నగర్ అనే యువతినే తాను పెళ్లి చేసుకున్నానని చెప్పేసింది. ఇది సరికాదు, తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లాలని పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, తాను మేజర్నని, ఏది మంచో.. ఏది చెడో తనకు తెలుసునని చెప్పింది. అయితే.. నికితను ట్రాప్ చేసిన రజనీ నగర్కు ఇది తొలిసారి కాదని, ఇంతకుముందు కూడా ఆమె ఓ అమ్మాయిని తన వలలో వేసుకుందని తెలిసింది. రజనీపై పలు క్రిమినల్ కేసులు ఇప్పటికే ఉన్నాయి.

మరిన్ని వార్తలు