హత్యల వెనుక పాక్‌ పాత్ర..!

23 Sep, 2018 11:50 IST|Sakshi

భారత జవాన్ల హత్యల వెనుక పాక్‌ ఐఎస్‌ఐ పాత్ర

నిర్థారించిన భారత నిఘా వర్గాలు

శ్రీనగర్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కశ్మీర్‌ జవాన్ల హత్య వెనుక బయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కశ్మీర్‌లోని రామ్‌గడ్‌ సెక్టార్‌తో పాటు.. సరిహద్దులో ముగ్గురు ప్రత్యేక ఎస్వీవోలను పాక్‌ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. కశ్మీర్‌లో జవాన్ల హత్యలను తీవ్రంగా భావించిన భారత నిఘా వర్గాలు దీని వెనుక పాకిస్తాన్‌ గుఢచారి సంస్థ ఐఎస్‌ఐ పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సైనికుల పేర్లను ఉగ్రవాదులకు చేరవేసి పక్కా ప్రణాళిక ప్రకారమే వారిని హతమార్చినట్లు ఐబీ వెల్లడించింది.

ముందుగా వారిని విధుల నుంచి వైదొలగాల్సిందిగా ఉగ్రవాదులు హెచ్చరించారని అయినా కూడా జవాన్లు వారి బెదిరింపులకు లొంగకపోవడంతో కిడ్నాప్‌ చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాకిస్తాన్‌ నైజాం మరోసారి బహిర్గతమైంది. సైనికుల హత్య వెనుక పాక్‌​ హస్తం ఉన్నట్లు మొదటి నుంచి భావించిన భారత్‌.. ఐరాసలో జరిగే భారత్‌-పాక్‌ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

పాక్‌ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాక్‌ తీరుకు ఖచ్చితంగా తూటాలతోనే సమాధానం చెప్తామని ఆర్మీ ప్రకటించింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్‌ సరిహద్దులో భారత సైన్యం భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్‌తో జరగాల్సిన చర్చలను భారత్‌ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్‌ ​ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర వ్యాఖ్యలతో భారత్‌పై విరుచుకుపడ్డారు. భారత్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని.. తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులు ఉన్నత స్థాయి పదవిలో ఉంటే ఇలానే ఉంటుందని మోదీపై ఇమ్రాన్‌ విషంగక్కారు.


 

మరిన్ని వార్తలు