100 కోట్ల అవకతవకలు

4 May, 2018 03:00 IST|Sakshi

సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉపేంద్రరాయ్‌ అరెస్ట్‌

న్యూఢిల్లీ: రూ.100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరపటంతోపాటు సివిల్‌ ఏవియేషన్‌ బ్యూరో సెక్యూరిటీ (బీసీఏఎస్‌)పాస్‌లు పొంది దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరించిన సీనియర్‌ జర్నలిస్టు ఉపేంద్రరాయ్‌తోపాటు మరికొందరిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇందుకు సంబంధించి లక్నో, నోయిడా, ఢిల్లీ, ముంబైల్లో గురువారం సోదాలు జరిపింది. ‘ఢిల్లీకి చెందిన ఉపేంద్ర రాయ్‌ అనే సీనియర్‌ జర్నలిస్ట్, ఎయిర్‌ వన్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భద్రతా అధికారి ప్రసూన్‌ రాయ్‌ మరికొందరితో కలిసి బీసీఏఎస్‌ను, ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్‌ను మోసం చేశారు.

తప్పుడు పత్రాలతో ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పాస్‌లు పొంది దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అత్యంత భద్రత ఉండే, నిషిద్ధ ప్రాంతాల్లో ప్రవేశానికి అనుమతి పొందారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారు. అక్రమ డబ్బు పెట్టుబడులకు రాహుల్‌ శర్మ, సంజయ్‌ స్నేహి సహకరించారు. 2017లో ఉపేంద్ర ఖాతాలో ఒక్కసారిగా రూ.79 కోట్లు జమయ్యాయి. ఐటీ శాఖలో సెటిల్‌మెంట్లకుగాను పలు నకిలీ కంపెనీల నుంచి రూ.16 కోట్లు వచ్చాయి’ అని సీబీఐ పేర్కొంది.

మరిన్ని వార్తలు