చెన్నై : తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రాబల్యం పెరుగుతున్నందునే తమను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగంగానే తమ పార్టీని బీజేపీ బీ టీమ్గా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని, తమది తమిళనాడు ఏ టీమ్ అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల అనంతరం విజయం సాధించే పార్టీవైపే మహాకూటమిలోని పార్టీలు పరుగులు తీస్తాయని, ఇలాంటి సమయంలో బేరసారాలకు తావులేకుండా తమ పార్టీ నిలకడగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఒక్కడినే లోక్సభ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోలేనని, ప్రజలు విరాళాలతో ముందుకు రావాలని, ఇది మెరుగైన భవిష్యత్కు పెట్టుబడిగా భావించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు.