కరోనా: ఓరి నాయనో.. ఇక పెళ్లి అవ్వదా!?

22 Mar, 2020 12:17 IST|Sakshi

ప్రేమ జంటకు పెళ్లి కష్టాలు

మూడుసార్లు వాయిదా

తిరువనంతపురం: ప్రేమ పెళ్లితో ఒక్కటవుదామనుకున్న ఓ జంటకు నిరాశే ఎదురవుతోంది. రెండేళ్ల కాలంలో మూడుసార్లు ముహూర్తం నిర్ణయించినా పెళ్లితంతు పూర్తికాకపోవడంతో ఆ ప్రేమ జంటను నిరాశ ఆవహిస్తోంది. రెండుసార్లు వైరస్‌, మరోసారి ప్రకృతి విపత్తు కారణంగా వారి వివాహం రద్దయింది. వివరాలు.. కేరళలోని ఎరాన్హీపాలం ప్రాంతానికి చెందిన ప్రేమ్ చంద్రన్ (26), సాండ్రా సంతోష్ (23) ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

కానీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్న వారి ప్రయత్నానికి ముచ్చటగా మూడోసారి కరోనా అడ్డు తగిలింది. రెండు రోజుల క్రితం జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడింది. తొలుత 2018 మే 20న వీరి పెళ్లికి ముహూర్తం కుదిరింది. అప్పట్లో నిఫా వైరస్ రాష్ట్రాన్ని చుట్టుముట్టడం,17 మంది చనిపోవడంతో పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఏడాది తర్వాత కేరళీయుల సంవత్సరాది ఓనం పండుగ రోజున పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. సరిగ్గా పెళ్లి రోజు సమీపించేసరికి రాష్ట్రాన్ని ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి.

భారీ వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం కావడంతో వీరి పెళ్లి మరోసారి వాయిదా పడింది. తాజాగా ఈనెల 20న పెళ్లికి  ముహూర్తం పెట్టారు. అయితే, ఈసారి కూడా వారి కల నెరవేరలేదు. ఆ యువ జంట ఆశల పై 'కరోనా' నీళ్లు చల్లింది. దేశవ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని మరోసారి వాయిదా వేసుకున్నారు. ఏదేమైనా సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకుని తీరతాం అంటున్న ఈ జంట ఆశ నెరవేరాలని కోరుకుందాం!

మరిన్ని వార్తలు