Covid New Varient: కొత్త రూపంలో కోవిడ్‌-19.. భారత్‌కూ తప్పని ముప్పు?

18 Nov, 2023 09:57 IST|Sakshi

కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉత్పరివర్తనమై బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో  బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకేలో  వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. 

రుచి లేదా వాసన కోల్పోవడం కోవిడ్-19 ప్రధాన లక్షణం అయితే, పిరోలా లేదా బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి. పిరోలా సోకినప్పుడు ముందుగా దాని ప్రభావం ముఖంపైనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, ఈ వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్‌ఎస్‌ఏ) తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాగా ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకేహెచ్‌ఎస్‌ఏ ముమ్మరం చేసింది. వృద్ధులు, పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా  ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో ఉండేటప్పుడు కూడా మాస్క్ ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు. కాగా బీఏ.2.86 కేసులు తొలిసారి గత జూలైలో కనిపించాయి. 
ఇది కూడా చూడండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు!

మరిన్ని వార్తలు