తల్లి, ఆమె ప్రియుడికి పెళ్లిచేశారు

27 Jul, 2016 17:32 IST|Sakshi
తల్లి, ఆమె ప్రియుడికి పెళ్లిచేశారు

కేరళలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఇద్దరు కూతుళ్లు తమ తల్లి ప్రేమ పరిపూర్ణం అయ్యేలా చేశారు. తల్లికి, ఆమె తొలి ప్రేమికుడికి వివాహం చేయించారు. సినిమాలా అనిపించే ఈ ప్రేమకథ 1980ల్లో మొదలైంది.

1984లో అనిత అనే అమ్మాయి కొల్లాం దగ్గరలోని ఒచిరాలో పదో తరగతి చదివేది. ఓ ట్యూషన్ సెంటర్లో విక్రమన్ అనే అతను టీచర్గా పనిచేసేవాడు. ఆ సమయంలో అనిత, విక్రమన్ ప్రేమలో పడ్డారు. అయితే ఈ ప్రేమకథ సుఖాంతం కాలేదు. వీరి పెళ్లికి అనిత తండ్రి తిరస్కరించాడు. దీంతో అనిత విక్రమన్కు దూరంకావాల్సి వచ్చింది. విక్రమన్ ఆమెకు దూరంగా చవారకు వెళ్లిపోయాడు. అక్కడ ఓ రాజకీయ కార్యకర్తగా పనిచేశాడు. ఆ తర్వాత అనిత ఒక్కసారి కూడా అతణ్ని కలవలేదు.


అనిత తండ్రి ఆమె కంటే వయసులో చాలా పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లయ్యాక అనిత జీవిత సాఫీగా సాగలేదు. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. అప్పటికి పెద్ద కూతురు ఆతిరాకు ఎనిమిదేళ్లు. కూతుళ్లకు మంచి చదువు చెప్పించి, ప్రయోజకులను చేయడానికి అనిత చాలా కష్టపడింది. అనిత కూతుళ్లు పెరిగిపెద్దవాళ్లయ్యాక ఆమె ప్రేమకథ గురించి తెలుసుకున్నారు. తమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లిని మళ్లీ ఆమె ప్రేమికుడి దగ్గరకు చేర్చి, జీవిత చరమాంకంలో ఆమె సంతోషంగా జీవించేలా చేయాలని నిర్ణయించారు. అయితే కూతుళ్లిద్దరికీ వివాహం చేశాక తన జీవితం గురించి ఆలోచిస్తానని అనిత చెప్పింది. ఆతిరాకు పెళ్లయ్యాక వివాహం చేసుకునేందుకు అనిత అంగీకరించింది. అనిత కూతుళ్లు విక్రమ్ను కలసి పెళ్లికి ఒప్పించారు. ఈ నెల 21న అనిత (52), విక్రమన్ (68) వివాహంబంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకథ 32 ఏళ్ల తర్వాత సాకారమైంది.
 

మరిన్ని వార్తలు