Delhi Pollution: ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు

14 Nov, 2023 07:46 IST|Sakshi

దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం మరింతగా పెరిగింది. గాలి నాణ్యత ‘పేలవమైన’ కేటగిరీకి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత స్థాయి 450కి చేరుకుంది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 360, ఆర్‌కె పురంలో 422, పంజాబీ బాగ్‌లో 415గా ఉంది. 

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కాలుష్యంతో పాటు పొగమంచు కమ్మేయనుంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)దీపావళి సందర్భంగా ఢిల్లీలోని 31 ప్రదేశాలలో శబ్ద కాలుష్యాన్ని అంచనా వేసింది. వీటిలో ఏడు నిశ్శబ్ద మండలాలు, ఎనిమిది నివాస ప్రాంతాలు, 11 వాణిజ్య, ఐదు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. నజాఫ్‌గఢ్‌లో అత్యల్ప స్థాయి శబ్ధ కాలుష్యం, కరోల్ బాగ్‌లో అత్యధిక శబ్ధ కాలుష్యం నమోదైంది. 

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ విశ్లేషణ ప్రకారం, దేశ రాజధానిలోని దాదాపు అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం కాలుష్య స్థాయిలు  మరింతగా పెరిగాయి. దీపావళి (ఆదివారం) నాడు ఢిల్లీలో 24 గంటల సగటు పార్టికల్‌ మీటర్‌(పీఎం)10 గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 430 మైక్రోగ్రాములుగా ఉంది. గత సంవత్సరం క్యూబిక్ మీటరుకు 322 మైక్రోగ్రాములు, 2021లో క్యూబిక్ మీటరుకు 748 మైక్రోగ్రాములుగా నమోదయ్యింది. అలీపూర్, పట్పర్‌గంజ్, నజాఫ్‌గఢ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లలో 2022తో పోలిస్తే 2023లో పార్టికల్‌ మీటర్‌ 10 సాంద్రతలు పెరిగాయని డీపీసీసీ డేటా వెల్లడించింది.  
ఇది కూడా చదవండి: గాజాపై హమాస్‌ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్‌

మరిన్ని వార్తలు