'టోల్‌గేట్ల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయండి'

30 Aug, 2018 18:12 IST|Sakshi

సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్‌ల వద్ద సిట్టింగ్‌ జడ్జిలు, వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని మద్రాస్‌ హైకోర్టు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ను ఆదేశించింది. ఈ సదుపాయం తీసుకొచ్చేందుకు తగిన చర్యలు ప్రారంభించాలని తెలిపింది. 'వీఐపీలు, సిట్టింగ్‌ జడ్జిల వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆపడం బాధాకరం. న్యాయమూర్తులు కూడా టోల్‌గేట్‌ల వద్ద దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేచి ఉండాల్సి రావడం దురదృష్టకరం' అని న్యాయస్థానం పేర్కొంది.

న్యాయమూర్తులు జస్టిస్‌ హులువడి జి రమేష్‌, జస్టిస్‌ ఎంవీ మురళిధరన్‌తో కూడిన ధర్మాసనం జడ్జిలు, వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని టోల్‌ప్లాజాలకు దీని గురించి తెలియజేస్తూ గమనిక పంపించాలని ఎన్‌హెచ్‌ఏఐకు తెలిపింది. వీఐపీలు, సిట్టింగ్‌ జడ్జిల వాహనాలు ఎలాంటి అడ్డంకులూ లేకుండా వెళ్లగలిగేలా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, షోకాజ్‌ నోటీసులు అందుకోవాల్సి వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐను హెచ్చరించింది. టోల్‌ ప్లాజాలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు