1, 2 తరగతులకు నో హోంవర్క్‌

4 Jun, 2018 01:20 IST|Sakshi

వర్షాకాల సమావేశాల్లో బిల్లు: జవదేకర్‌

కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 1, 2 తరగతులు చదువుతున్న విద్యార్థులకు త్వరలోనే హోంవర్క్‌ బాధ తప్పనుంది. ఆ తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌ ఇవ్వకుండా పాఠశాలలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రానున్న వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ‘నో హోంవర్క్‌’ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆదివారం వెల్లడించారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009కు అనుగుణంగా ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని, ఇది  ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

1, 2 తరగతుల విద్యార్థుల స్కూల్‌ బ్యాగుల బరువు తగ్గించడంతోపాటు వారికి ఎలాంటి హోంవర్క్‌ ఇవ్వకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీచేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు గత నెల 30న కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే ఈ తరగతుల విద్యార్థులకు భాష, గణితం తప్ప మరే ఇతర సబ్జెక్టు బోధించకుండా అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లెర్న్‌ విత్‌ ఫన్‌ అనే విధానాన్ని తాను విశ్వసిస్తానని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు