పాక్‌లో జడ్జిగా హిందూ మహిళ 

30 Jan, 2019 02:34 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మొదటిసారి సుమన్‌ కుమారి అనే హిందూ మహిళ సివిల్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఖంబర్‌–షాదద్కోట్‌ జిల్లాకు చెందిన సుమన్‌ హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం కరాచీలోని స్జాబిస్ట్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. సుమన్‌ తండ్రి పవన్‌ కుమార్‌ బోదన్‌ మాట్లాడుతూ.. ఖంబర్‌ షాదద్కోట్‌ జిల్లాలోని పేదలకు ఉచితంగా న్యాయపరమైన సాయం అందించేందుకు తన కూతురు పాటుపాడుతోందని చెప్పారు.

‘సుమన్‌ ఒక సవాల్‌గా వృత్తిని ఎంచుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా న్యాయం కోసం నిజాయతీతో పోరాడుతుంది..’అని అన్నారు. సుమన్‌ తండ్రి పవన్‌ కంటి వైద్య నిపుణుడు కాగా, పెద్ద చెల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, మరో చెల్లి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. సుమన్‌ కంటే ముందు హిందూ మతం నుంచి జస్టిస్‌ రానా భగవాన్‌ దాస్‌ కొద్దికాలం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా సేవలందించారు. పాక్‌ జనాభాలో 2 శాతం మంది హిందువులున్నారు. 

మరిన్ని వార్తలు