ఒక్కసారి అధికారమివ్వండి

29 Sep, 2014 23:12 IST|Sakshi

సాక్షి, ముంబై: తమ పార్టీకి ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండీ, రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని అభివృద్ధి చేసి చూపిస్తానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఉద్ఘాటించారు. ఠాకూర్ విలేజ్‌లో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొదటి ప్రచార సభలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐ పార్టీలను లక్ష్యంగా విమర్శనాస్త్రాలను సంధించారు.

ఆయా పార్టీల నాయకులపై ఘాటుగా విమర్శలు చేశారు. 10-15 రోజులుగా సీట్ల సర్దుబాటుపై ఇరు కూటములు తర్జన భర్జన పడ్డాయి. చర్చలు జరుపుతున్నట్లు నాటకాలాడాయని ఆరోపించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్  ఓ  బీజేపీ నాయకుడికి ఫోన్ చేసి ‘మీరు శివసేనతో తెగతెంపులు చేసుకున్న అర గంటకే మేం కూడా కాంగ్రెస్‌తో విడిపోతామని’ చెప్పారని ఆరోపించారు.

 ఈ సమయంలో బాల్ ఠాక్రే బతికి ఉన్నట్లయితే బీజేపీ ఇలా వ్యహరించే సాహసం చేసేదికాదన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరిగేవి, ఎలా పొత్తు సాగేదని మరోసారి గుర్తు చేశారు.

ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని, అందరూ స్వార్థపరులేనని ఇలాంటి పార్టీలను ఎలా నమ్మాలో తెలియడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలేపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినట్లు చెప్పుకోవడాన్ని ఎద్దెవా చేశారు. ఈ ఆఫర్ విని బయటవారే కాదు ఇంట్లో వాళ్లు కూడా నవ్వుకుని ఉండవచ్చని  అన్నారు.

ముంబై  ఇతర ప్రాంతీలకు అడ్డగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం, స్థలం దొరికి న చోట గుడిసెలు వేసుకోవడం..  ఇలా వెలసిన మురికివాడలను ప్రభుత్వం పునరాభివృద్థి పథకం కింద వారికి పక్క ఇళ్లు నిర్మించి ఇవ్వడం, తరువాత వాటిని అమ్ముకుని మళ్లీ గుడిసెలు వేయడం ఇలా ద శాబ్ధాల నుంచి జరుగుతుందన్నారు. తమ పార్టీ అధికారంలో వస్తే ఏం చేస్తామో అందుకు సంబంధించిన బ్ల్యూ ప్రింట్ ఇటీవల విడుదల చేశానని, ఆ ప్రకారం కచ్చితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని మీకు హామీ ఇస్తున్నానని అన్నారు.

>
మరిన్ని వార్తలు