-

ఓటమిపై పోస్టుమార్టం

2 Jul, 2014 02:13 IST|Sakshi

- ఆత్మావలోకన సమావేశంలో సీఎంకు వ్యతిరేకంగా పలువురి ఫిర్యాదు
- హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన దిగ్విజయ్ సింగ్
- ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్‌కు అధిష్టానం పిలుపు

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత వారంతంలో నిర్వహించిన ఆత్మావలోకన సమావేశంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. ఓటమికి ఆయనే కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనిపై నివేదికను  అధిష్టానానికి సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరల నుంచి వివరణ కోరడానికి బుధవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఇద్దరినీ ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో సీఎంపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ వివరణ కోరే అవకాశముంది.  
 
ఒంటెత్తు పోకడలు
నగరంలో పార్టీ నాయకులతో దిగ్విజయ్ సింగ్ బహిరంగంగానే చర్చించినప్పటికీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనను విడిగా కలుసుకుని సిద్ధరామయ్య, ఆయన సన్నిహితులపై ఆరోపణలు చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో  కేవలం తొమ్మిది స్థానాలతోనే తృప్తి పడాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య వ్యవహార శైలే ఇందుకు కారణమని,  అందరినీ ఏకతాటిపై నడిపించక పోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందని విశ్లేషించారు.

ఏడాది కిందట జరిగిన శాసన సభ ఎన్నికల్లో 122 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చినా... లోక్‌సభ ఎన్నికల్లో 136 సెగ్మెంట్లలో వెనుకబడి పోయామని వివరించారు. ప్రభుత్వ పనితీరుపై రాష్ర్టంలో ప్రధాన సామాజిక వర్గాలైన ఒక్కలిగులు, లింగాయత్‌లు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందనే భావన ఆ వర్గాల్లో నెలకొందని చెప్పారు. పూర్వాశ్రమంలో జేడీఎస్‌కు చెందిన వారు సీఎం చుట్టూ కోటరీగా ఏర్పడి, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తొలి నుంచీ కాంగ్రెస్‌నే నమ్ముకున్న వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు