నాగ్పూర్: ఆరు నెలలలోపు వయసున్న మూడు పులి పిల్లలు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జునోనా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. చంద్రపూర్, నాగ్భిడ్ స్టేషన్ల మధ్యగుండా వెళ్తున్నపుడు బల్లార్షా–గోండియా రైలు ఈ పులికూనలను ఢీకొట్టి ఉంటుందని మహారాష్ట్ర అటవీఅభివృద్ధి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రిషికేష్ రంజన్ వెల్లడించారు. మూడింటిలో రెండు.. అవని అనే ఆడపులికి చెందిన పిల్లలుగా అటవీ అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో డజనుకుపైగా గ్రామస్థులను పొట్టనబెట్టుకున్న ఆడపులి అవనిని ఈనెల మూడోతేదీన ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ ప్రముఖ షూటర్ అస్ఘర్ అలీఖాన్ కాల్చిచంపడం తెల్సిందే.