కొట్టాయం: లిబియాలో జరిగిన రాకెట్ దాడిలో కేరళకు చెందిన తల్లీ కొడుకులు మృత్యువాత పడ్డారు. సబ్రతా పట్టణంలోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో శుక్రవారం రాత్రి జరిగి షెల్ ఎటాక్ లో కేరళ నర్సు సును, ఆమె కుమారుడు (18 నెలలు) మరణించారని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న రాత్రి జరిగిన ఈ దాడిలో వీరితోపాటుగా మరికొంతమంది వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది. అక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు మిగిలిన వారి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2012 నర్సు సును, భర్త విపిన్ తో కలిసి లిబియాకు వెళ్లారు. కాగా దాడి సమయంలో భర్త బయటికి వెళ్లడంతో అతను బతికి బయటపడ్డాడు.
ఈ ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ట్విట్ చేశారు. సును సత్యన్, ఆమె కొడుకు ప్రణవ్ చనిపోయినట్టుగా సమాచారం అందిందన్నారు. సును భర్తతో కాంటాక్ట్ లో ఉన్నట్లు ఆమె తెలిపారు. లిబియాలోని భారత దౌత్యా అధికారలను దీనిపై నివేదిక కోరినట్టు సుష్మ తెలిపారు.