శివసేనలో చేరతారంటూ ప్రచారం.. ఖండించిన ఊర్మిళ

17 Sep, 2019 17:09 IST|Sakshi

ముంబై: తాను ఏ పార్టీలో చేరడం లేదంటున్నారు నటి  ఊర్మిళ మటోండ్కర్‌. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీని వీడిన ఊర్మిళ, శివసేనలో చేరుతున్నారంటూ వస్తోన్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఏ పార్టీలో చేరడం లేదు. మీడియాకు నా విన్నపం ఒక్కటే.. మీరు బయటి వ్యక్తుల ద్వారా విన్న విషయాలను ప్రచారం చేయకండి. ఏదో ఓ పార్టీలో చేరుతున్నాని ప్రచారం చేయడం సముచితం కాదు. ప్రస్తుతం నేను ఏ పార్టీలో చేరాలనుకోవడం లేదు’ అన్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఊర్మిళ శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే పీఏ మిలింద్‌ నవ్రేకర్‌తో భేటీ కావడంతో ఆమె శివసేనలో చేరతారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో ఊర్మిళ ఈ వార్తలపై స్వయంగా స్పందించాల్సి వచ్చింది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ పట్టుమని 6 నెలలు కూడా గడవక ముందే ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాయకత్వ లోపం, అంతర్గత కలహాలతో విసిగిపోవడం వల్లే ఆ పార్టీని వీడుతున్నానని ఊర్మిళ ప్రకటించారు.(చదవండి: ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!)

మరిన్ని వార్తలు