నేను కాంగ్రెస్‌ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నా: కేటీఆర్‌

21 Nov, 2023 18:20 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ రోడ్డు షోలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఛలోక్తులు విసిరారు. ‘తెలంగాణలో 24 గంటల కరెంటు కనిపిస్తలేదన్న కాంగ్రెస్‌ నేతలారా.. ముస్తాబాద్ రండి.. ఎప్పుడు వస్తారో చెప్పండి. నేనే బస్సు పెడతా. వచ్చి లైన్‌లో నిల్చొని మండలంలో కరెంట్ వైర్లు గట్టిగా పట్టుకుని చూడండి. కరెంటుందో, లేదో తెలిసిపోతుంది’ అన్నారు. 

‘మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను. కేసీఆర్ ఆశీర్వదిస్తే మంత్రి అయ్యాను. తెలంగాణలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని నంబర్ వన్ చేశాను. మీరు ఓటు వేస్తే నేను ఎమ్మెల్యే అయి మీరు గౌరవంగా తల ఎత్తుకునేలా పని చేశాను. మీకోసం పని చేస్తున్నా. నన్ను మరొకసారి ఆశీర్వదించండి. ఎలక్షన్ రాగానే వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మొద్దు. మనస్పూర్తిగా ఆలోచించి  నాకు ఓటేయండి’ అని ప్రజలను కేటీఆర్‌ కోరారు. 

‘కేసీఆర్‌కు తెలంగాణ మీద ఉండే ప్రేమ.. రాహుల్ గాంధీ, మోడీకి ఉంటదా..? కాంగ్రెస్సోళ్లు ధరణి ఎత్తేస్తామంటున్నరు. ధరణిపోతే మళ్లీ పట్వారీ వ్యవస్థ వ‍స్తుంది. పట్వారీ వ్యవస్థ వస్తే ఎట్లుంటదో మీకు తెలుసుగా. కాంగ్రెస్సోళ్లు 3 గంటల కరెంటు ఇస్తమంటున్నరు. మళ్లీ రాత్రి బాయికాడికి పోయి పండుకోవాలి. ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లు కట్టాలి’ అని కేటీఆర్‌ హెచ్చరించాలి. 

ఇదీచదవండి..కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు

మరిన్ని వార్తలు