ఏపీలో ఇసుక మాఫియాపై పీఎంఓకు ఫిర్యాదు

26 Mar, 2018 19:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియాపై వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డా.రాజేంద్ర సింగ్ సోమవారం ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు లేఖ రాశారు. అధికార టీడీపీ నేతల అండతో ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ‘కృష్ణ, గోదావరిలో యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. వాళ్ల చేతుల్లో ఆయుధాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇసుక మాఫియాతో అన్ని స్థాయిల అధికారులు కుమ్మక్కు అయ్యారు. అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. టీడీపీ నేతల అరాచకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, అటవీశాఖతో దర్యాప్తు చేయించాలి’ అని రాజేంద్ర సింగ్‌ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో సాగుతున్న ఇసుక తవ్వకాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్‌ చేస్తూ ‘రేలా’అనే స్వచ్ఛంద సంస్థ  ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు