విద్యార్థితో పారిపోయింది! టీచర్‌పై రేప్ కేసు!!

12 Mar, 2016 21:57 IST|Sakshi

తిరున్వేలి: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలే దారితప్పింది. తన కన్నా వయస్సులో చిన్నవాడైన 15 ఏళ్ల బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఏడాది పాటు అతనితో గడిపి.. చివరకు గర్భవతి అయింది.  దీంతో ఆ 23 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడి జరిపినట్టు అభియోగాలు మోపారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

జిల్లాలోని కడయనల్లూరు గ్రామంలో ఓ ప్రైవేటు స్కూల్లో 23 ఏళ్ల యువతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పీజీ చదివిన ఆమె తన విద్యార్థి అయిన 15 ఏళ్ల బాలుడితో ఏడాది కిందట ఇంటి నుంచి పారిపోయింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆ బాలుడు 60 తులాల బంగారం, రూ. 10వేలు ఎత్తుకుపోయాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిగా రహస్యంగా గడుపుతున్న ఇద్దరిని పోలీసులు తాజాగా తిరుపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు మిల్లు వద్ద గుర్తించారు. ఇద్దరు కూడా మిల్లులో పనిచేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఓ ప్రైవేటు టెలిఫోన్ కేంద్రం నుంచి వారు స్నేహితులకు, సన్నిహితులకు ఫోన్ చేస్తుండటంతో ఈ నంబర్ ద్వారా పోలీసులు వాళ్ల ఆచూకీని కనిపెట్టారు. గర్భవతి అయిన టీచర్‌ను అరెస్టు చేసి మేజిస్ట్రేటు ముందు హాజరు పరుచగా.. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రేప్, కిడ్నాప్ తోపాటు బాలలపై లైంగిక నేరాల వ్యతిరేక చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు