ఏపీకి మంచి రోజులు రావడం ఖాయం : రత్నాకర్‌

1 Jan, 2019 14:36 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అమెరికా విభాగం కన్వీనర్ రత్నాకర్‌తో పాటూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గంలో ఉన్న వైఎస్‌ జగన్‌కు పార్టీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌ రెడ్డి సమక్షంలో పుష్పగుచ్ఛం ఇచ్చి ఎన్‌ఆర్‌ఐల తరపున రత్నాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు.   

ఈ ఏడాది పార్టీ ఘనవిజయం సాధించాలని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని కోరినట్టు రత్నాకర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే అది కేవలం వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమన్నారు. ఈ సంవత్సరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు, రాష్ట్రానికి హోదా రావాలని ఆకాంక్షించారు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడ ఈ ఏడాదైనా విరుగుడు అవుతుందన్నారు. చంద్రబాబు పాలనకు ఈ ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు చరమగీతం పాడతారని, మరోసారి రాజన్న రాజ్యాన్ని వైఎస్‌ జగన్‌ తీసుకొస్తారని అభిలషించారు. గత కొన్ని నెలలుగా తాను కూడా పాదయాత్రలో పాల్గొంటున్నానని, ప్రజల తీరును గమనిస్తున్నానని, ఈ ఏడాది రాష్ట్రానికి మంచి రోజులు రావడం ఖాయం అన్నారు.

మరిన్ని వార్తలు