-

సిక్కుల గాయం రేగనుందా!

28 Jan, 2014 00:45 IST|Sakshi
సిక్కుల గాయం రేగనుందా!

సిక్కుల ఓట్లను చీల్చి, అకాలీలను బలహీనం చేయడానికి కాంగ్రెస్ భింద్రన్‌వాలేను సమర్థించిన మాట నిజం. దీనితో ఇతడు 1980లో  స్వర్ణదేవాలయాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాడు. వాటికి జగ్జీత్‌సింగ్ చౌహాన్ మొదలుపెట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాదం తోడైంది.
 

 ఆధునిక కాలం, సమాచార వ్యవస్థ చారిత్రక సత్యాలను చీకట్లో మిగిలిపోకుండా చేస్తున్నాయి. ఆధునిక సంక్షోభాలూ మూలాలూ ఇప్పటి తరానికి అక్షరం పొల్లుపోకుండా అందుతు న్నాయి. 1984 నాటి అమృత్‌సర్ సైనిక చర్య ఆ విధంగానే చరిత్ర పుటలలో వాక్యాలుగా జనం ముందుకువస్తోంది. ఈ డొంకకు చెందిన తీగ ఇంగ్లండ్‌లో కదిలింది.
 
 జూన్ 3-8, 1984లో స్వర్ణదేవాలయం మీద జరిగిన సైని క చర్య ‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు సంబంధించిన రెండు ప్రస్తా వనలు 2013, జూన్, ఈ జనవరిలలో  ప్రపంచం ముందుకు వచ్చాయి. ఈ చర్యలో ఇంగ్లండ్ సాయం ఉందని తెలియజేసే ఒక పత్రం ప్రస్తావన ఈ జనవరి 17న అక్కడి పార్లమెంటులో రావడంతో గగ్గోలు మొదలైంది. హర్‌మందిర్ సాహెబ్ (స్వర్ణ దేవాలయం)లో దాగిన సిక్కు వేర్పాటువాదులను బయటకు రప్పించడానికి సాయపడాలని నాటి మన ప్రధాని ఇందిర, ఇంగ్లండ్ ప్రధాని మార్గరెట్ థేచర్ (కన్సర్వేటివ్ పార్టీ)కు లేఖ రాశారనీ, ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్‌ఎఎస్) సభ్యులు భారతదేశం వచ్చి పథక రచన చేసి ఇచ్చా రనీ, దానినే ఇందిర ఆమోదించారనీ ఆ పత్రం సారాంశం. 1984, ఫిబ్రవరి 6, 23 తేదీలలో రెండు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి.  ఆ పథకమే ‘ఆపరేషన్ బ్లూ స్టార్’. బ్రిటిష్ పార్లమెంటులో ఉన్న ఒకే ఒక్క సిక్కు ఎంపీ ఇందర్‌జిత్ సింగ్ దీని మీద దర్యాప్తు జరిపించాలని కోరారు. కన్సర్వేటివ్ పార్టీ ప్రధాని థేచర్‌కు ఇందులో ఉన్న ప్రమేయం గురించి దేశా నికి తెలియచేయాలని లేబర్ పార్టీ ఎంపీ టామ్ వాట్సన్ కూడా ప్రస్తుత ప్రధాని కామెరూన్‌కు విజ్ఞప్తి చేశారు.  
 
 ‘సిక్కుల చరిత్రలో మనం నిర్వహించిన నెత్తుటి కాండ నుంచి పలాయనం చిత్తగించలేం’ అంటూ జనవరి 17నే ‘ది టైమ్స్’ పత్రికలో బెన్ మేసింటైర్  అనే కాలమిస్ట్ వ్యాఖ్యానిం చాడు. 1919 నాటి జలియన్ వాలాబాగ్ దురంతంతో దీనిని  పోలుస్తూ, బెన్ చేసిన తీవ్ర వ్యాఖ్య అది. కానీ, ఇందులో బ్రిటన్ ప్రమేయం ఉన్నట్టు చెప్పలేనని ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కుల్దీప్‌సింగ్ బ్రార్ ఒక ఇంగ్లిష్ న్యూస్ చానెల్‌తో వెంటనే చెప్పారు. ‘సాయం’ సమా చారం సైన్యం దృష్టికి ఎప్పుడూ రాలేదు కాబట్టి దర్యాప్తు అవస రమని కూడా బ్రార్ చెప్పారు.
 
 స్వాతంత్య్రం వచ్చిన తరువాత  ఆంతరంగిక కల్లోలంలో సైన్యం పాలు పంచుకున్న  వివాదాస్పదమైన కార్యక్రమం బ్లూ స్టార్.  ప్రభుత్వ లెక్కల ప్రకారం అందులో మృతులు నాలుగు వందలు. ఆ సంఖ్య వేలల్లోనే ఉందని  సిక్కుల ఆరోపణ. సంత్ జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలే కేంద్ర బిందువుగా ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. సిక్కులలో దమ్‌దమి అనే చిన్న తెగ నాయ కుడు భింద్రన్‌వాలే. సిక్కుల ఓట్లను చీల్చి, అకాలీలను బల హీనం చేయడానికి కాంగ్రెస్ భింద్రన్‌వాలేను సమర్థించిన మాట నిజం. దీనితో ఇతడు 1980లో  స్వర్ణదేవాలయాన్ని తన కార్యకలాపాలకు కేంద్రంగా మార్చాడు. వాటికి జగ్జీత్‌సింగ్ చౌహాన్ మొదలుపెట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాదం తోడైంది. చివరికి 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ ద్వారా భింద్రన్‌వాలేను, అతడి అనుచరులను హతమార్చారు.
 
 ఇందులో వేర్పాటువాదుల, ఉగ్రవాదుల పాత్ర ఎంత వివాదాస్పదమో, సైన్యం నిర్వ హించిన పాత్ర కూడా అంతే వివాదాస్పదం. సైనిక చర్య పేరు తో అప్పుడు ఏం జరిగిందో మాజీ కేంద్రమంత్రి బల్వంత్ సింగ్ రామూవాలియా 2013 జూన్‌లో వెల్లడించారు. ‘డే అండ్ నైట్ న్యూస్ చానెల్’లో (చండీగఢ్) కన్వర్‌సాంధు అనే జర్నలిస్ట్ ఏర్పాటు చేసిన చర్చలో (30 ఏళ్లు గడిచిన సందర్భంగా) రామూవాలియా చెప్పిన అంశాలు తీవ్రమైనవి. ఆపరేషన్  మొదలయ్యాక  జూన్ 5వ తేదీ సాయంత్రం, ఒక ట్రాన్స్‌మి ట్టర్‌తో సహా వచ్చిన ఐదుగురు సిక్కు యువకులు జీఎస్ తోహ్రా (శిరోమణి ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు), హెచ్ ఎస్ లోంగో వాల్ (అకాలీదళ్ నేత) మీద తుపాకులు ఎక్కు పెట్టి ఖలిస్తా న్‌ను ప్రకటించవలసిందిగా ఆదేశించారనీ, అందుకు తోహ్రా నిరాకరించారనీ మాజీ మంత్రి వెల్లడించారు.
 
 అప్పుడే, తోహ్రా, లోంగోవాల్ మాటలు ట్రాన్స్‌మిట్టర్ ద్వారా జియా ఉల్ హక్ విని దాడికి వస్తారని కూడా ఉగ్రవాదులు చెప్పార ట. 30 మంది సిక్కు యువకులను సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్చిన వైనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. బ్లూస్టార్ దేశానికో చేదు అను భవం. సరిగ్గా 5 మాసాల తరువాత అక్టోబర్ 31న ఇందిరను సిక్కు అంగరక్షకులు కాల్చిచంపారు. తరువాత జరిగిన అల్ల ర్లలో మూడువేలకు పైగా అమాయక సిక్కులు చనిపోయారు. బ్లూస్టార్ చర్యలో ఇంగ్లండ్ పాత్ర గురించి కామెరూన్ దర్యా ప్తునకు ఆదేశించారు. భారత్ ఏం చేస్తుందో తెలియదు. కానీ ఎన్నికల ముందే ఇంగ్లండ్ దర్యాప్తు పూర్తయితే మిగిలిన పరిణా మాలు ఎలా ఉన్నా, సిక్కుల గాయం రేగక తప్పదు. ఇందిర నోట పదేపదే వినిపించిన విదేశీ హస్తం సంగతీ తేలుతుంది!
 - డాక్టర్ గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు