ఈసీ లేఖపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

19 Mar, 2020 11:40 IST|Sakshi

ఈసీ లేఖపై అనేక అనుమానాలు

అధికారికంగా స్పందించని ఎన్నికల కమిషనర్‌

చంద్రబాబు హస్తం ఉంది: మం‍త్రులు

సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌  పేరుతో వెలువడిన లేఖ వ్యవహారంను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ తీసుకుంది. ఈసీ పేరుతో కేంద్ర హోంశాఖకు తానే స్వయంగా లేఖ రాసినట్లు రమేష్‌ కుమార్‌ ఇప్పటికీ చెప్పకపోవడంతో.. ఈ అంశాన్ని రాజకీయ కుట్రగా ప్రభుత్వం భావిస్తోంది. లేఖ వ్యవహారంపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ప్రచారం చేస్తున్నా.. రమేష్‌ స్పందించకపోవడంతో ఆయన మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈసీ లేఖను సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ విపరీతంగా ప్రచారం చేయడంతో ఇది ముమ్మాటికీ చంద్రబాబు నాయుడు కుట్రగానే ప్రభుత్వం భావిస్తోంది. (తీర్పు తర్వాత ఆకాశ రామన్న లేఖ!)

ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు ఈసీకి అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. వాయిదాపై ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడంతో ఏంటని న్యాయస్థానం నిలదీసింది. దీంతో కుట్రపూరితంగా టీడీపీతో రమేష్‌ కుమార్‌ కుమ్మకై ఈ లేఖను తెరపైకి తచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఖపై ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషన్‌ ప్రతినిధి స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. దీంతో తాజా లేఖపై విచారణ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.


రమేష్‌ కుమార్‌ ఎందుకు స్పందిచలేదు..
ఈ నేపథ్యంలోనే ఈసీ లేఖపై మంత్రులు తీవ్ర స్థాయిలో స్పందించారు. రమేష్‌ కుమార్‌ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తంచేశారు. లేఖపై రమేష్‌ కుమార్‌ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. ఆయన వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈసీ లేఖపై రమేష్‌ వెంటనే స్పందించాలని మరో మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆయన లేఖ రాసి ఉండకపోతే దానిపై విచారణ జరపాలని డీజీపీ కోరాలని అన్నారు. లేఖ వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలను ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అవంతి మండిపడ్డారు. (ఎన్నికల కోడ్‌ ఎత్తివేత)

పోలీసులుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..?
ఎన్నికల కమిషనర్‌ పేరుతో లేఖ విడుదలైందని, అది తప్పుడు లేఖ అయితే రమేష్‌ కుమార్‌ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన మౌనం దేనికి సంకేతమని అన్నారు. లేఖతో ఆయనకు ఏం సంబంధంలేకపోతే.. బాధ్యత గల అధికారిగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 
 

మరిన్ని వార్తలు