‘చంద్రబాబు వల్లనే ప్రపంచబ్యాంక్‌ తప్పుకుంది’

19 Jul, 2019 10:39 IST|Sakshi

టీడీపీ విధానాలపై చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌

సాక్షి, అమరావతి : చంద్రబాబు దుర్మార్గాల వల్లనే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచ బ్యాంకును అడిగింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు నివేదికలు పంపారని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూ రికార్డులను తారుమారు చేస్తున్నారని రైతులు ప్రపంచ బ్యాంకు దృష్టి తీసుకెళ్లారని వెల్లడించారు. కౌలు రైతులు, రైతులను టీడీపీ సర్కార్‌ ఇబ్బందులకు గురిచేసిన కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. తమ భూములు కాజేస్తున్నారని దళితులు ప్రపంచబ్యాంకుకు సమాచారమిచ్చారని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేస్తేనే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడం లేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. 

మరిన్ని వార్తలు