సాక్షి, అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టారు. శాసనమండలి సమావేశం సందర్భంగా ఆయన సభలోకి రాగా.. సభ్యులంతా గౌరవసూచకంగా నిలబడి స్వాగతం పలికారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఆహమ్మద్ మహమ్మద్, టీడీపీ ఫ్లోర్ లీడర్ యనమల రామకృష్ణుడితో పాటు సభ్యులందరికి వైఎస్ జగన్ అభివాదం చేసారు. టీడీపీ ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్కు వైఎస్ జగన్కు షేక్హ్యాండ్ ఇచ్చారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ కొనసాగింది. ఇక శని, అదివారం సెలవు దినాలు కావడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై తీర్మానం ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం డిప్యూటీ స్పీకర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడిన అనంతరం స్పీకర్ సభను ప్రారంభించారు. ఈ ఎన్నిక కోసం సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య మాటల యుద్దం కొనసాగింది. కాకాని గోవర్థన్ రెడ్డి గవర్నర్ ప్రసంగాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014నుంచి ఇప్పటి వరకు హోదా కోసం కట్టుబడి ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో అధికారాన్ని, నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.