సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్ అని నమ్మానని, కానీ ఆయన ఒంటెద్దు పోకడలకు పోయారని రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సూచనలు చేసినా పట్టించుకోలేదని, తానేప్పుడు వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేయలేదన్నారు. చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన సభలో ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడు నమ్మిన సిద్ధాంతం వీడలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తామని, వచ్చే ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, హోదాపై అనేక సార్లు యూటర్న్ తీసుకున్నారన్నారు. అమరావతి గురించి గొప్పగా చెప్పే చంద్రబాబు.. ఎందుకు ఓడిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజలు 23 సీట్లు టీడీపీకి ఇచ్చినా ఆ పార్టీ సభ్యుల తీరు మారడం లేదన్నారు. పదేపదే తన ప్రసంగానికి అడ్డుపడటం సరికాదన్నారు.
రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పొలవరం ప్రాజెక్ట్పై కూడా టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఈ ప్రాజెక్ట్లో ఎంత అవినీతి జరిగిందో కమిటీ నిగ్గు తేల్చబోతుందన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియా చేయడం గొప్ప అంశమన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని టీడీపీ నిర్వీర్యం చేసిందని, గత ప్రభుత్వంలో చాలా సామాజిక వర్గాలు అభద్రతా భావానికి లోనయ్యాయని తెలిపారు. అందుకే ప్రజలు వైఎస్ జగన్ను అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించారని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే ప్రసక్తేలేదని.. చెప్పిన దమ్మున్న నేత వైఎస్ జగన్మోహన్రెడ్డినే అని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు దశాబ్దాలుగా ఉన్న ఆర్టీసీ సమస్యల టీడీపీ పరిష్కరించలేకపోయిందని, అధికారంలోకి రాగానే ఆర్టీసీ సమస్యలను పరిష్కరించే దిశగా.. తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.