లాలూ కొడుకుపై కోటి నజరానా

25 Nov, 2017 10:00 IST|Sakshi

పట్న : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పై బీజేపీ నేత ఒకరు నజరానా ప్రకటించారు. తేజ్‌ చెంప పగలకొట్టిన వారికి కోటి రూపాయలు ఇస్తానని అనిల్‌ సాహ్ని శుక్రవారం ఓ ప్రకటన జారీచేశారు. 

తేజ్‌ ఈ మధ్య బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ(బీజేపీ) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆయన అక్రమాలను బయటపెడతానని.. ప్రజల ముందే చెంప పగలకొడతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో పట్నా బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్‌ అయిన సాహ్ని ఈ కొత్త ఆఫర్‌ ప్రకటించాడు. ‘‘మోదీపై దాడి చేస్తానని తేజ్‌ చెప్పాడు.. అంతకంటే ముందే ఎవరైతే తేజ్‌పైనే దాడి చేస్తారో వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాం’’ అని ప్రకటించాడు. అంతేకాదు తేజ్‌ చేత క్షమాపణలు చెప్పేదాకా లాలూ ఇంటి ముందు ధర్నా చేపడతామని హెచ్చరించాడు. 

సాహ్ని వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయన ప్రకటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటికే వివరణ కోరామని... అది సహేతుకంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమని పేర్కొంది.  లాలూ తన కొడుకులను అదుపులో పెట్టుకోవాలని సూచించింది కూడా. కాగా, ఔరంగాబాద్‌లో తేజ్‌ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ... డిసెంబర్‌ 3న జరగబోయే సుశీల్‌ కొడుకు ఉత్కర్ష్‌ పెళ్లి ఆహ్వానం తనకు అందిందని.. ఒకవేళ తాను అక్కడికి వెళ్తే మాత్రం రచ్చ చేయటం ఖాయమని హెచ్చరికలు చేశాడు.

మరిన్ని వార్తలు